కాక్రోచ్ ఉద్యమం: బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు అస్త్రంగా మారనుందా?

Priyanka Gandhi Vadra

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శివాంగి జైస్వాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 9 నిమిషాలు

కాక్రోచ్ జనతా పార్టీ జులై 20న చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఆందోళన, నిరసనకారులపై జరిగిన పోలీస్ చర్య... విద్యా వ్యవస్థ, ప్రభుత్వ జవాబుదారీతనం అంశాలను జాతీయ రాజకీయాల కేంద్ర బిందువుగా మార్చాయి.

కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, శివసేన (ఉద్ధవ్ థాకరే), ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేడీ సహా పలు ప్రతిపక్షాలు నిరసనకారులకు మద్దతుగా నిలిచాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

అయితే, మంగళవారం ప్రధాని నివాసం సమీపంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ధర్నా చేయడంపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ విద్యార్థుల సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. అయినప్పటికీ, నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చించడానికి ప్రభుత్వం వంద శాతం సిద్ధంగా ఉందన్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రతిపక్షానికి సీజేపీ ద్వారా ఒక కొత్త రాజకీయ వేదిక దొరికిందా, లేక ఇది తాత్కాలిక కూటమి మాత్రమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అలాగే, ఈ పరిణామాల వల్ల ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, దిల్లీ, జంతర్ మంతర్, పార్లమెంట్ మార్చ్, కాంగ్రెస్

ఫొటో సోర్స్, Arun SANKAR / AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, సోమవారం నాడు పార్లమెంట్ మార్గ్ వైపు దూసుకెళ్తున్న నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

అన్నా హజారే ఉద్యమం లాంటి సందర్భమేనా?

'ది హిందూ' మాజీ అసోసియేట్ ఎడిటర్, సీనియర్ రాజకీయ జర్నలిస్ట్ స్మితా గుప్తా... 2011 నాటి, అలాగే జులై 2026 నాటి రాజకీయ పరిస్థితుల మధ్య పోలికలను పరిశీలించారు.

"2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి అంశంపై బీజేపీ పోరాటం చేస్తూ వచ్చింది. కానీ, సాధారణ ప్రజలు అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ కంటే అన్నా హజారే నేతృత్వంలోని 'ఇండియా అగెనెస్ట్ కరప్షన్' ఉద్యమంపైనే నమ్మకం ఉంచారు. ఆ తర్వాత, అందరికీ తెలిసినట్లే 2014లో కాంగ్రెస్ చేతిలో నుంచి అధికారం పోయింది, నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది" అని ఆమె వివరించారు.

"ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది. కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా విద్యా వ్యవస్థ సమస్యను లేవనెత్తుతూ నిరసనలు చేస్తున్నప్పటికీ, దానికి పెద్దగా ప్రజల మద్దతు లభించలేదు. కానీ, ఒక 'విద్యావంతుడు, అవగాహన ఉన్న సాధారణ పౌరుడు' అయిన అభిజీత్ దీప్కే ఇదే సమస్యను ఆన్‌లైన్‌లో లేవనెత్తినప్పుడు, ప్రజల నుంచి భారీగా మద్దతు లభించింది. అది కాస్తా ఇప్పుడు 'కాక్రోచ్ జనతా పార్టీ' రూపంలో క్షేత్రస్థాయి నిరసనగా మారింది" అన్నారు.

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, దిల్లీ, జంతర్ మంతర్, పార్లమెంట్ మార్చ్, కాంగ్రెస్

ప్రభుత్వంపై సామాన్య ప్రజల మనసుల్లో ఉన్న కోపానికి కాక్రోచ్ జనతా పార్టీ ఒక గొంతుకగా మారిందని స్మితా గుప్తా అభిప్రాయపడ్డారు.

మరోవైపు, చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ పరిణామాలను కవర్ చేస్తున్న సీనియర్ రాజకీయ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్... ఈ రెండు నిరసనల సామాజిక-రాజకీయ నేపథ్యాలు వేర్వేరు అని అభిప్రాయపడ్డారు.

"2011 నాటి ఉద్యమం అంత పెద్దది కావడానికి కారణం... అప్పటి ప్రధాన మీడియా స్రవంతి నిరసనకారుల గళాన్ని వినిపించడమే. ఈ రోజు దానికి భిన్నంగా జరుగుతోంది. అదే మీడియా ఈ నిరసనను బద్నాం చేస్తూ, దీని వెనుక పాకిస్తాన్ కోణాన్ని వెతుకుతోంది" అన్నారు.

"ఈ రోజుల్లో సోషల్ మీడియా ఒక పెద్ద శక్తి అయినప్పటికీ, ఇది మొబైల్ వినియోగదారుల ఆసక్తులకు అనుగుణంగానే కంటెంట్‌ను చూపిస్తుంది. ఇటువంటి వాతావరణంలో దీని ద్వారా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలను ఎక్కువ కాలం పాటు సమీకరించడం కష్టం" అని కిద్వాయ్ అభిప్రాయపడ్డారు.

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, దిల్లీ, జంతర్ మంతర్, పార్లమెంట్ మార్చ్, కాంగ్రెస్

ఫొటో సోర్స్, Ritesh Shukla/Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని నివాసం సమీపంలో ధర్నాకు కూర్చున్న రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు.

కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనం పొందుతుందా?

"ప్రాంతీయ పార్టీలన్నీ చాలా బలహీనపడ్డాయి. అందువల్ల సీజేపీ సృష్టించిన ఈ వాతావరణం వల్ల రాజకీయంగా కాంగ్రెస్‌కే లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అయితే ఈ అంశాన్ని ఆ పార్టీ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందనేది చూడాలి. ఎందుకంటే దీన్ని అణచివేయడానికి బీజేపీ దగ్గర కూడా ఎన్నో వ్యూహాలు ఉంటాయి" అని రషీద్ కిద్వాయ్ అన్నారు.

బీజేపీ రాజకీయాలను నిశితంగా పరిశీలించే సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. 2011 ఉద్యమం తర్వాత యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి రావడం, పలువురు మంత్రులు రాజీనామా చేయడానికి ప్రధాన కారణం... ఆనాటి ప్రతిపక్షం బీజేపీ ఆ ఉద్యమాన్ని ముందుకు నడపడమేనని అన్నారు.

జులై 20 నిరసన తర్వాత బీజేపీపై ఒత్తిడి పెరిగిన మాట వాస్తవమే, కానీ దీన్ని ఇలాగే కొనసాగించడం ప్రతిపక్షాల చేతుల్లోనే ఉంది. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నట్లు కనిపిస్తున్నాయి.

ప్రధాని నివాసం సమీపంలో రాహుల్ గాంధీ చేసిన ధర్నాపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

"సీజేపీ ధర్నాను బలహీనపరిచేందుకు మోదీ గారే రాహుల్ గాంధీని తన నివాసం బయట ధర్నాకు కూర్చోబెట్టారు" అని ఆయన 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు.

అయితే, కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా సంజయ్ సింగ్ వాదనను తోసిపుచ్చింది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారని సీజేపీ స్పష్టం చేసింది.

కాగా, రాహుల్ గాంధీ రాజకీయాలను ఒకప్పుడు అభిజీత్ దీప్కే విమర్శించేవారు. దీనిపై జర్నలిస్ట్ అజిత్ అంజుమ్‌ ఇంటర్వ్యూలో అభిజీత్ స్పందిస్తూ, గతంలో అది తన వ్యక్తిగత అభిప్రాయమని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విద్యకు సంబంధించిన సీజేపీ చేసిన డిమాండ్లకు మద్దతు ఇస్తోందని, అందువల్ల తన ఆలోచనలో మార్పు వచ్చిందని చెప్పారు.

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, దిల్లీ, జంతర్ మంతర్, పార్లమెంట్ మార్చ్, కాంగ్రెస్

జులై 20 నిరసనతో వచ్చిన ఈ ఊపును ప్రతిపక్షాల్లో కేవలం కాంగ్రెస్ మాత్రమే ముందుకు తీసుకెళ్లగలదని భాస్కర్ గ్రూప్ మాజీ నేషనల్ పొలిటికల్ ఎడిటర్ హేమంత్ అత్రి అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు బలహీనంగా ఉండటమే దీనికి కారణమని ఆయన అన్నారు.

"ఆమ్ ఆద్మీ పార్టీకి అంత సామర్థ్యం ఉంటే, అది సీజేపీ ఉద్యమాన్ని తన సొంత ఉద్యమంగా మార్చుకునేది. ఎందుకంటే అభిజీత్ దీప్కే ఆ పార్టీతో అనుబంధం కలిగి ఉన్నారు. కానీ, దిల్లీలో ఆప్ సంస్థాగత బలం ఇప్పుడు తగ్గిపోయిందనే నిజాన్ని ఈ ఉద్యమం బహిర్గతం చేసింది" అని హేమంత్ అన్నారు.

అయినప్పటికీ, దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో అతిపెద్ద రాజకీయ శక్తిగా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

జర్నలిస్ట్ స్మితా గుప్తా అభిప్రాయం ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన వ్యక్తం చేయడం వెనుక పంజాబ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఆప్ పార్టీకి కాంగ్రెస్ నుంచే ప్రధాన సవాలు ఎదురవుతోంది. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలిసి నిలబడటం ఆప్ ఇష్టపడదు.

జులై 20న జరిగిన పార్లమెంట్ మార్చ్ నిరసన రూపంలో.. చాలాకాలం తర్వాత దిల్లీలో సీజేపీ పిలుపు మేరకు ఒక భారీ ప్రజా ఆందోళన కనిపించింది.

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, దిల్లీ, జంతర్ మంతర్, పార్లమెంట్ మార్చ్, కాంగ్రెస్

ఫొటో సోర్స్, Arvind Yadav/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్ నుంచి వాంగ్‌చుక్‌ను తీసుకెళ్లిన తర్వాత సీజేపీ నిరసన స్థలాన్ని ముట్టడించిన భద్రతా దళాలు.

ఈ నిరసన సీజేపీదా, ప్రజలదా?

కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకే ఈ నిరసన జరిగినప్పటికీ, ఇంత భారీ సంఖ్యలో నిరసనకారులు వస్తారని నిర్వాహకులు సైతం ఊహించలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే నిరసన సమయంలో పలు నిర్వహణా లోపాలు కూడా కనిపించాయని సీనియర్ జర్నలిస్ట్ హేమంత్ అత్రి అన్నారు.

స్మితా గుప్తా మాట్లాడుతూ, "కాక్రోచ్ జనతా పార్టీ' పేరు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఏర్పాటు వెనుక సీజేఐ సూర్యకాంత్ చేసిన కాక్రోచ్ వ్యాఖ్యలే ఉన్నప్పటికీ... ఈ ప్లాట్‌ఫామ్‌కు రెండు కోట్ల మందికి పైగా నెటిజన్ల మద్దతు లభించినప్పుడు, వారి భావోద్వేగాలకు అభిజీత్ దీప్కే బాధ్యత వహించారు. ఆయన తన చదువు, కెరీర్‌ను వదులుకుని భారతదేశానికి వచ్చి దీన్ని ఒక ఉద్యమంగా మార్చారు" అన్నారు.

ప్రస్తుత పరిణామాల ద్వారానే దీప్కే రాజకీయాలు నేర్చుకుంటున్నారని స్మితా అభిప్రాయపడ్డారు. అందుకే, ఇప్పుడు కేవలం ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఉద్యమ వేగాన్ని కొనసాగించగలవని ఆమె అంటున్నారు.

వాంగ్‌చుక్, దీప్కేల కూటమి వెనుక "ప్రతిపక్షాలకు ఏమాత్రం స్థానం ఇవ్వకూడదని" భావించే ఒక రాజకీయ శక్తి పనిచేస్తోందని హేమంత్ అత్రి అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, వారు నిరాహార దీక్ష విరమించే ప్రకటనలో ప్రతిపక్షాల ముందు షరతులు పెట్టడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను పక్కన పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు.

దీనిపై జర్నలిస్ట్ విజయ్ త్రివేది స్పందిస్తూ, ఉద్యమం తీవ్రమయ్యే కొద్దీ, దానికి సంబంధించిన వ్యూహాలు కూడా మారుతూ ఉంటాయని అన్నారు.

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, దిల్లీ, జంతర్ మంతర్, పార్లమెంట్ మార్చ్, కాంగ్రెస్

ప్రాంతీయ పార్టీలకు ఉన్న అవకాశాలు ఏమిటి?

జులై 20న జరిగిన పార్లమెంట్ మార్చ్ నిరసనపై దిల్లీ పోలీస్ జరిపిన లాఠీచార్జ్ వల్ల పలువురు నిరసనకారులు గాయపడ్డారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.

ఎస్పీ, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్ థాకరే), ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ నేతలు జంతర్ మంతర్ వద్దకు వెళ్లి గాయపడిన నిరసనకారులకు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ నాయకులలో శరద్ పవార్ కూడా ఉన్నారు. మరోవైపు మమతా బెనర్జీ సైతం ఈ నిరసనలో పాల్గొంటానని ప్రకటించారు. బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమయం కాంగ్రెస్ పార్టీకే కాకుండా ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల ఉనికికి కూడా ఎంతో కీలకమైనదని నిపుణులు భావిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ నేషనల్ పొలిటికల్ ఎడిటర్ సునేత్రా చౌదరి ఎక్స్ వేదికగా స్పందిస్తూ... "ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సైతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నారంటే, ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. నవీన్ పట్నాయక్ సాధారణంగా వివాదాస్పద రాజకీయ అంశాలపై తటస్థంగా ఉంటారు, ఏ పక్షానా బహిరంగంగా మాట్లాడరు" అని తెలిపారు.

సీనియర్ జర్నలిస్ట్ స్మితా గుప్తా మాట్లాడుతూ, "విద్యా రంగ సమస్య ప్రతి రాష్ట్రంతో ముడిపడి ఉంది. చీలికలను ఎదుర్కొన్న టీఎంసీ, శివసేన వంటి పార్టీలకు తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి ఈ అంశం ఒక మంచి అవకాశంగా మారవచ్చు. అందుకే ఆ పార్టీలు ఈ సమస్యను లేవనెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత దిల్లీలో కనిపించిన నిరసనకారుల భారీ గుంపును ప్రతి ఒక్కరూ చూశారు" అన్నారు.

సీజేపీకి మద్దతు ఇవ్వడం వెనుక సమాజ్ వాదీ పార్టీకి ఒక ముఖ్యమైన లక్ష్యం ఉండొచ్చని స్మితా గుప్తా అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఆమె ఇక్కడ ప్రస్తావించారు. అందుకే సీజేపీ నిరసనలో డింపుల్ యాదవ్ పాల్గొనడం, రాహుల్ గాంధీ ధర్నాలో అఖిలేష్ యాదవ్ ఉండటం కీలక పరిణామాలని ఆమె భావిస్తున్నారు. ఈ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.

రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ధర్నాకు ఎందుకు కూర్చున్నారు?

జూన్ 6న అభిజీత్ దీప్కే భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ను సీజేపీ క్షేత్రస్థాయి నిరసనగా మార్చింది.

దిల్లీ, పుణె, జైపూర్, లక్నో వంటి నగరాల్లో చిన్నచిన్న నిరసనల తర్వాత, వారు జూన్ 20 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరవధిక ధర్నాకు కూర్చున్నారు. దీనికి సీపీఐ విద్యార్థి సంఘం 'ఐసా' మద్దతు ఇచ్చింది.

జూన్ 28న ఈ ధర్నాలో సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సమయంలో కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు సీజేపీ వేదికపై వ్యక్తిగత స్థాయిలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాకరే) కూడా దీనికి మద్దతు ప్రకటించాయి.

కానీ ఈ సమయమంతటా, సీజేపీకి కాంగ్రెస్ పార్టీ చాలా పరిమితమైన, వ్యూహాత్మక మద్దతు మాత్రమే ఇస్తూ వచ్చింది. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేడా మాత్రం నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్ చుక్‌ను కలవడానికి వెళ్లారు. అయితే, జులై 20న జరిగిన పార్లమెంట్ మార్చ్ నిరసన మరుసటి రోజున రాహుల్ గాంధీ ఒక్కసారిగా రోడ్డెక్కారు.

కాంగ్రెస్ పార్టీ ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి కారణం.. సీజేపీ వెనుక ఏదైనా రాజకీయ శక్తి పనిచేస్తోందేమోనని పరిశీలించాలనుకోవడమేనని రషీద్ కిద్వాయ్ భావిస్తున్నారు. సీజేపీ ఉద్యమంలో వెనక నిలబడే అనుచరుడిగా మారడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

సీజేపీ వేదికపైకి రాహుల్ గాంధీ వచ్చి మద్దతు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువని, ఇప్పుడు ప్రజల డిమాండ్‌కు తానే నాయకత్వం వహించాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు, కాంగ్రెస్ ఇంతలా ముందుకు రావడానికి కారణం గత 24 గంటల్లో జరిగిన పరిణామాల్లోనే దాగి ఉందని హేమంత్ అత్రి అన్నారు.

హేమంత్ అత్రి విశ్లేషణ ప్రకారం, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం క్రియాశీలంగా మారడం అనేది జులై 20 నిరసన తర్వాత జరిగిన సంఘటనల ఫలితమే. సోమవారం నిరసన జరిగినప్పుడు రాహుల్ గాంధీ దీనిపై బహిరంగంగా స్పందించలేదని, కానీ పోలీసు చర్య, గాయపడిన నిరసనకారుల ఫోటోలు బయటకు వచ్చిన తర్వాతే కాంగ్రెస్ రంగంలోకి దిగింది.

కాంగ్రెస్ తన నాయకులను జంతర్ మంతర్‌కు పంపింది. మరుసటి రోజు రాహుల్ గాంధీ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిరసనకారులకు న్యాయపరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ నాయకత్వం అకస్మాత్తుగా ప్రధాని నివాసం వెలుపల నిరసన ప్రదర్శన చేయాలని నిర్ణయించింది.

"నిన్న(జులై 21) ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది కాంగ్రెస్ ఎంపీలు ఆయనను కలవడానికి వచ్చినప్పుడు... వారితో ఆయన ప్రధాని నివాసానికి వెళ్లి ధర్నా చేయాలని చెప్పారు. అంతకుముందు ఈ ప్రణాళిక కేవలం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లకు మాత్రమే తెలుసు" అని అత్రి.. తనకున్న విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారంగా చెప్పారు.

ఆ తర్వాత, ఈ సమస్య విద్యార్థి ఉద్యమం స్థాయి నుంచి దాటి పెద్ద రాజకీయ నిరసనగా మారిపోయిందని హేమంత్ అభిప్రాయపడ్డారు.

"లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిని పోలీసులు ఈ విధంగా బలవంతంగా తరలించడం ఇదే మొదటిసారి" అన్నారాయన.

కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిలో ఉందా?

జులై 20న జరిగిన నిరసన, జులై 21న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, అఖిలేష్ యాదవ్‌లు చేపట్టిన ధర్నా... ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయని జర్నలిస్ట్ విజయ్ త్రివేది అన్నారు

ఈ పరిణామాల నేపథ్యంలో "ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి ఉండాల్సింది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

రషీద్ కిద్వాయ్ విశ్లేషణ ప్రకారం, జంతర్ మంతర్ వద్ద గత నెల రోజులుగా ఉద్యమం జరుగుతున్నప్పుడే, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిత్వ శాఖను మార్చాల్సింది. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే ఏదైనా కఠినమైన చర్య తీసుకోబోతోందనే సంకేతాలు ఇప్పటికీ ఏవీ కనిపించడం లేదు.

నీట్ పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంగళవారం ఎన్డీయే ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ చెప్పారు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగిస్తారనడానికి దీనిని ఒక సంకేతంగా భావించలేమని కిద్వాయ్ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై మంగళవారం అర్థరాత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు చేశారు. విద్యార్థుల సమస్యను వారు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. నీట్, విద్యా రంగానికి సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ కాంగ్రెస్ చర్చను వదిలేసి నిరసనల బాట పట్టిందన్నారు.

విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించడానికి, సంస్కరణలు తేవడానికి, జవాబుదారీతనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులను రాజకీయ ప్రచారాలకు సాధనాలుగా మార్చకూడదని ప్రధాన్ అన్నారు.

రాహుల్ గాంధీ మొదటి ప్రాధాన్యం పార్లమెంట్‌లో నీట్ అంశంపై చర్చ జరపడమే అయి ఉండాలని విజయ్ త్రివేది భావిస్తున్నారు. మంత్రి రాజీనామా డిమాండ్‌ను రాహుల్ సభలోనే లేవనెత్తవచ్చని సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)