మీ భూమిని 22ఏ జాబితాలో చేర్చితే ఏమవుతుంది? 7 ప్రశ్నలు - సమాధానాలు

తెలంగాణలో ఇప్పుడు 22ఏ భూముల చర్చ నడుస్తోంది.
ఆ జాబితాలో ఉన్న భూమి యజమానులు తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పటికే అగ్రిమెంట్లు చేసుకున్నవారు, అడ్వాన్సులు ఇచ్చిన వారు, త్వరలో అమ్మాలనుకున్న వారు ఇటువంటి వారికి ఇది చాలా ఇబ్బందికరంగా మారింది.
ఈ పరిస్థితుల్లో అసలు ఈ 22ఏ జాబితా అంటే ఏంటి? ఆ సమస్యకు పరిష్కారం ఏంటి?
మీ భూమి ఈ జాబితాలో చేరితే ఏం చేయాలి వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


రిజిస్ట్రేషన్ల చట్టంలోని 'సెక్షన్ 22A' ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా భూమిని ఎవరూ కొనకుండా, అమ్మకుండా నిషేధించగలదు.
అంటే ఆ భూమి రిజిస్టర్డ్ పత్రం ద్వారా బదిలీ కాదు. ఉదాహరణకు, ఒక సర్వే నంబరులో గల భూమిని ఈ 22ఏ జాబితాలో చేరిస్తే, ఇక ఆ సర్వే నంబరులో భూమి లావాదేవీలన్నీ నిలిచిపోతాయి. అమ్మకం, కొనుగోలు, పవర్ ఆఫ్ అటార్నీ, తాకట్టు, గిఫ్టు డీడ్.. ఏదీ ఉండదు.
''రెవిన్యూ సిబ్బంది, లేదా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా ఈ జాబితాలోకి భూములను చేర్చవచ్చు'' అని బీబీసీతో చెప్పారు న్యాయవాది దేవేందర్ రెడ్డి.

ప్రాథమికంగా ప్రభుత్వ భూములను కాపాడటం కోసం పెట్టిన సెక్షన్ ఇది.
ప్రభుత్వ భూములు, హిందూ దేవాదాయ భూములు, ముస్లింల వక్ఫ్ భూములు, పేదలు, దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు, సీలింగ్ మిగులు భూములు, కొన్ని సందర్భాల్లో కోర్టుల్లో ఉన్న భూములు ఇతరులకు రిజిస్టర్ కాకుండా, వాటిని ఎవరూ తమ పేరిట రాయించుకోకుండా ఈ సెక్షన్ అడ్డుకుంటుంది.


1999లో అప్పటి ప్రభుత్వం 1908 నాటి రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేసి ఈ సెక్షన్ తెచ్చింది. కానీ, అప్పట్లో హైకోర్టు దాన్ని కొట్టేసింది.
తరువాత తిరిగి 2007లో మరోసారి ఈ చట్ట సవరణ తెచ్చారు. అప్పటి నుంచి ఈ సెక్షన్ అమల్లో ఉంది.
22A ప్రకారం అసైన్డ్ భూములు, ఎండోమెంట్ అంటే హిందూ ఆలయం లేదా ట్రస్ట్ భూములు, సీలింగ్ మిగులు భూములు, వక్ఫ్ భూములు, ప్రభుత్వానికి ఆసక్తి ఉన్న భూములు లేదా కోర్టులు జప్తు చేసిన భూములు ఈ సెక్షన్ లో ఉంటాయి.

- అమ్మలేరు, కొనలేరు.
- పవర్ ఆఫ్ అటార్నీ, తాకట్టు, గిఫ్ట్ డీడ్ చేయలేరు.
- బ్యాంకులు అప్పులు ఇవ్వవు.

మీ భూమి 22Aలో ఉందో లేదో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూసుకోవాలి.
తెలంగాణలో వ్యవసాయ భూమి అయితే 'భూభారతి' (ధరణి)లో, పట్టణ భూములు అయితే ఐజీఆర్ఎస్(IGRS) రిజిస్టర్ ద్వారా చూసుకోవాలి.
మీ భూమి పత్రాలన్నీ.. అంటే, పట్టాదారు పాసుపుస్తకాలు, పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు, లేఅవుట్ అప్రూవల్స్ అన్నీ భద్రంగా ఉంచుకోవాలి.
కోర్టు కేసుల తీర్పు కాపీలను భద్రంగా ఉంచుకోవాలి.
ఇక కొనాలనుకునే వారు కొనేముందు, అడ్వాన్స్ ఇచ్చేముందు, అగ్రిమెంట్ చేసుకునే ముందు ఆ భూమి ఈ జాబితాలో ఉందా అనేది చూసుకోవాలి.


ఈ ప్రశ్నకు న్యాయవాది, పాత్రికేయులు, ఈ అంశంపై సుదీర్ఘ పరిశోధన చేసిన చింతకుంట్ల దేవేందర్ రెడ్డి బీబీసీకి వివరణ ఇచ్చారు.
''తెలంగాణలో ధరణి రాకముందు కేవలం 16 లక్షల ఎకరాల భూమి ఈ జాబితాలో ఉండేది. ధరణి వచ్చినప్పుడు 1955 ఖాస్రా పహాని ప్రకారం 22ఏ తీసుకున్నారు.
దీంతో 1955 తరువాత కొందరు వివిధ ప్రభుత్వ భూములను తమ స్వాధీనంలోకి తీసుకుని సాగు చేస్తున్నవి, ఇండ్లు కట్టుకున్నవి కూడా 22ఏలో వచ్చేశాయి.
ఉదాహరణకు, ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చాలా మందికి పట్టాలు ఇచ్చారు. కానీ, అవేవీ ఇందులో రాకుండా, నిషేధిత జాబితాలో కనిపించాయి.
ఇప్పుడు భూ భారతిలో కూడా దాదాపు అదే తప్పు జరుగుతోంది. దాంతో ధరణి, భూభారతి తరువాత దాదాపు కోటి ఎకరాలకు పైగా భూమి ఇందులోకి వచ్చింది. దీంతో చాలా మంది భూమి అమ్ముదామని పోతే, ఎన్వోసీ అంటున్నారు'' అన్నారు దేవేందర్ రెడ్డి.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లేదా కలెక్టర్ కార్యాలయం ద్వారా ఏ కారణంగా లేదా ఏ జీవో ద్వారా ఆ భూమి నిషేధిత జాబితాలో పెట్టారో చెప్పాలంటూ, సంబంధిత పత్రాలు ఇవ్వాలంటూ రాతపూర్వక లేఖ ఇవ్వాలి.
మీ భూమి ఆ జాబితాలోకి ఎందుకు వెళ్లకూడదో వివరిస్తూ, మీ దగ్గర ఉన్న ఆధారాలతో కలెక్టర్ కార్యాలయంలో లేదా నిర్దేశిత అధికారి కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాలి. అందుకోసం పాత, కొత్త అన్ని రకాల పత్రాలూ, ఆధారాలూ, ఈసీ వంటివి అన్ని ఫోటోస్టాట్ కాపీలు దానికి జతచేయాలి.
ఒకవేళ కోర్టు ఉత్తర్వుల వల్ల ఆ జాబితాలో చేరితే, దాన్ని కోర్టు ద్వారానే సరిచేసుకోవాలి. లాయర్ ద్వారా ప్రయత్నం చేయాలి.
రెవెన్యూ అధికారుల స్థాయిలో సమస్య పరిష్కారం అయిపోతే సరే. లేకపోతే కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలి.
తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చెబుతోన్న వివరాల ప్రకారం తమ భూముల విషయంలో ఫిర్యాదులకు ఈ కింది వారిని సంప్రదించాలి:
- Section 22A (1)(a), (b), (d)కు సంబంధించిన ఫిర్యాదుల కోసం సంబంధిత జిల్లా కలెక్టర్ను సంప్రదించాలి.
- Section 22A (1)(c)కు సంబంధించిన ఫిర్యాదుల కోసం సంబంధిత ఆస్తులకు సంబంధించి వక్ఫ్ బోర్డు సీఈఓ, లేదా ఎండోమెంట్ కమిషనర్ను సంప్రదించాలి.
- Section 22A (1)(e)కు సంబంధించిన ఫిర్యాదుల కోసం పౌరులు చీఫ్ కమిషనర్, భూపరిపాలన (CCLA) ఏర్పాటు చేసిన కమిటీకి వెళ్లాలి.

రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?
''ఇది ప్రక్రియ అయినప్పటికీ ఈ విషయమై కొందరు నేరుగా హైకోర్టుకు కూడా వెళుతున్నారు'' అంటూ క్షేత్ర స్థాయిలో పరిస్థితి వివరించారు చింతకుంట్ల దేవేందర్ రెడ్డి.
గత ఆరు నెలలుగా తెలంగాణలో ఈ అంశం బాగా చర్చలో ఉంది. తాజాగా తీవ్రత పెరిగింది. దీంతో రాజకీయ పార్టీలూ దీనిపై స్పందించాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ 22ఏ వ్యవహారంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి.
''ప్రభుత్వ భూములను కాపాడాల్సిన "సెక్షన్ 22A" నిబంధన, రెవెన్యూ అధికారులకు, రాజకీయ నాయకులకు ఒక ప్రైవేటు ఏటీఎంగా మారిపోయింది.
నిజమైన ప్రభుత్వ స్థలాలను వదిలేసి, దశాబ్దాలుగా రైతులు, మధ్యతరగతి ప్రజలు అనుభవిస్తున్న ప్రైవేటు పట్టా భూములను కావాలనే 22A జాబితాలో పెడుతున్నారు.
డబ్బిచ్చిన వారి భూమిని ఆ జాబితా నుంచి తొలగిస్తున్నారు. తెలంగాణలో లక్షలాది మంది ఇందులో చిక్కుకున్నారు. ఈ ఎన్వోసీల కోసం నెలల తరబడి ఎదురు చూడడం సరికాదు. అప్లికేషన్ ఏ దశలో ఉందో ఆన్లైన్ ట్రాకింగ్ ఉండాలి.
జాప్యానికి కారణమైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు పట్టా భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. ఎన్వోసీ జారీకి గరిష్టంగా 30 రోజుల కాలపరిమితి విధించాలి'' అని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్.

ఫొటో సోర్స్, FB/ponguleti
ప్రజలు ఆందోళన చెందొద్దు: పొంగులేటి
''తెలంగాణ రాష్ట్రంలో సెక్షన్ 22A (నిషేధిత జాబితా)ను అడ్డుపెట్టుకుని పేద రైతులు, ప్రైవేట్ భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
గతంలో 10 శాతంగా ఉన్న 22A భూముల విస్తీర్ణం, ఇప్పుడు 30 నుంచి 40 శాతానికి పెరిగి కోటి ఎకరాలకు చేరుకుంది. రైతుల భూములను ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితాలో చేర్చి, ముడుపులు చెల్లిస్తేనే ఆ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ప్రభుత్వం కోర్టుకు సైతం అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ఫారెస్ట్ భూముల కన్సాలిడేటెడ్ వివరాలను సమర్పించకుండా దాచేస్తోంది'' అని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి.
మరోవైపు, ఈ ఆరోపణలపై ప్రభుత్వం తరఫున రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు.
''నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని పిలుపునిచ్చారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. కొత్తగా ఎలాంటి భూములను మా ప్రభుత్వం ఈ నిషేధిత జాబితాలో చేర్చలేదు. గత ప్రభుత్వం నుంచి ఉన్న చట్టపరమైన సాంకేతిక చిక్కులను పరిష్కరించి బాధితులకు ఊరట కలిగిస్తాం'' అని ప్రకటించారు మంత్రి పొంగులేటి.
మరోవైపు, భూముల రెగ్యులరైజేషన్కి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే-అవుట్ల అనుమతులు వంటి అన్ని డాక్యుమెంట్లను ఆగస్టు 14లోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
‘అధికారాలను పరిమితం చేయాలి’
''సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణాధికారాలు ఉండకూడదు. అదనపు అధికారాలు వద్దు. ఆన్లైన్లో ఏది ఉంటే దానికి ఆమోదం తెలిపే వరకే వారి అధికారాలను పరిమితం చేయాలి'' అని తెలంగాణ రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు.
''ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తేలేదు. అదే సమయంలో పీఓబీ జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించకుండా 3 రోజుల సమయం తీసుకొని ఎందుకు తిరస్కరించవలసి వస్తుందన్న వివరాలను తెలియజేయాలని ఆదేశించాం. ప్రతి దరఖాస్తూ తహసీల్దార్కు పంపకుండా నేరుగా కలెక్టర్కే పంపించాలి. కలెక్టర్ నుంచి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నుంచి కలెక్టర్ మధ్యనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలి'' అని మంత్రి తెలిపారు.
గ్రామం లేదా మండలాన్ని యూనిట్గా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన క్షేత్ర స్థాయికి వెళ్లి సమగ్రంగా పరిష్కరిస్తేనే ఈ సమస్య తీరుతుందని, లేదంటే మరింత జటిలం అవుతుందని అన్నారు దేవేందర్ రెడ్డి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)






























