You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాలన్పూర్: ‘రూ.50వేలకు భార్యను స్నేహితులకు అమ్మేసిన భర్త’-అసలు ఈ కేసు ఏంటి?
(గమనిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు కలవరపరచవచ్చు)
"పాలన్పూర్లో ఒక భర్త తన భార్యను 50 వేల రూపాయలకు అమ్మేశారు. కొనుగోలు చేసిన భర్త స్నేహితులు ఆమెపై అత్యాచారం చేశారు".
మే 26న జరిగిన విలేఖరుల సమావేశంలో పాలన్పూర్ పశ్చిమ పోలీసులు చెప్పిన మాటలివి. 'మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన కేసు' ఒకటి గుజరాత్లోని బనాస్కాంత జిల్లా పాలన్పూర్లో బయటకు వచ్చింది.
ఈ కేసులో నిందితుడైన భర్త, తన భార్య కనిపించడం లేదంటూ మే 11న పాలన్పూర్ పశ్చిమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఈ మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేస్తుండగా, రెండు రోజుల తర్వాత (మే 13న) ఆయన మరో పోలీస్ స్టేషన్ పాలన్పూర్ తూర్పులో కూడా భార్య అదృశ్యమైనట్లు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. లోతుగా విచారించడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
ఏం జరిగింది?
ఒకే కేసుపై అనుమానాస్పదంగా రెండు ఫిర్యాదులు రావడంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, చివరికి బాధితురాలిని కనుగొన్నారు.
అయితే, పోలీసుల విచారణలో, తనను భర్తే అమ్మేశాడని ఆ మహిళ తెలిపారు. తన భర్త రూ. 50,000లకు తనను కొందరికి విక్రయించారని ఆమె చెప్పారు.
పాలన్పూర్ పశ్చిమ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్కే పటేల్ నేతృత్వంలోని పోలీసుల బృందం.. ప్రధాన నిందితుడైన భర్తతో సహా మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడికి గతంలో కూడా అనేక నేరాలతో సంబంధం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
పోలీసులు ఏమన్నారంటే..
పాలన్పూర్ డీఎస్పీ జిగ్నేశ్ గామిత్ ఈ కేసు వివరాలను మీడియాకు తెలియజేశారు.
"మాకు ఈ కేసుపై అనుమానం వచ్చింది. దీంతో జిల్లా పోలీసులు నిశితంగా, లోతుగా దర్యాప్తు చేశారు" అని డీఎస్పీ అన్నారు.
"భార్య అదృశ్యమైనట్లు భర్త రెండు ఫిర్యాదులు దాఖలు చేయడంతో, ఆయన్ను పోలీసులు విచారించారు. ఆ తర్వాతే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగుచూశాయి" అన్నారు.
"ఫిర్యాదుదారు స్నేహితులు బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె చెవి నగలను కూడా తీసుకున్నారు" అన్నారు.
ఈ ఘటనపై పాలన్పూర్ పశ్చి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఏడుగురు అరెస్ట్
ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జిగ్నేశ్ తెలిపారు. స్థానిక కోర్టు ద్వారా వారందరినీ రిమాండ్కు తీసుకున్నట్లు చెప్పారు.
ప్రధాన నిందితుడైన భర్తకు గతంలో కూడా అనేక నేరాలతో సంబంధం ఉందని, ఆయన పాత నేరాల చరిత్రను కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
నిందితుల తరఫు వాదనను తెలుసుకోవడానికి బీబీసీ గుజరాతీ ప్రయత్నించింది. అయితే, ఈ కథనం రాసే సమయానికి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వారి స్పందన రాగానే ఈ కథనంలో అప్డేట్ చేస్తాం.
కేసు తీవ్రతను, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని నిందితులు లేదా బాధితురాలి గుర్తింపును వెల్లడించడం లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)