అమెరికా అడిగితే.. లారెన్స్ బిష్ణోయీని భారత్ అప్పగిస్తుందా? ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, BBC/Reuters/NCB
- రచయిత, బరీందర్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
భారత్ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయీ గ్యాంగ్తో పాటు మరో రెండు గ్రూపులపై అమెరికా కఠిన చర్యలు చేపట్టింది.
ఈ మూడు గ్రూపులకు చెందిన 24 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి.
అంతర్జాతీయ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లు, హత్యలు, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తదితర కేసుల దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపాయి.
బిష్ణోయీ గ్యాంగ్తో సహా భారత్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మూడు నేర ముఠాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అమెరికా, కెనడా, యూరప్లో ఈ అనుమానితులను అరెస్టు చేసినట్లు అమెరికా ప్రభుత్వ న్యాయవాదులు వెల్లడించారు.
ఈ విషయాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా అటార్నీ కార్యాలయం వెల్లడించింది.

అయితే, అమెరికా చర్యల అనంతరం సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి. భారత్లో జైల్లో ఉన్న నేరస్తుడిని అమెరికాకు అప్పగించవచ్చా?
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడాలో జరిగితే అమెరికా కోర్టులు ఈ కేసును ఎలా విచారణ జరుపుతాయి?
ఈ చర్య భారత్, అమెరికా దౌత్య సంబంధాలపై ప్రభావం చూపనుందా?

ఫొటో సోర్స్, SIKH PA
భారత్లో జైల్లో ఉన్న ఖైదీని అమెరికాకు అప్పగించచ్చా?
బహిర్గతమైన మూడు అభియోగపత్రాల ప్రకారం, మొత్తం 37 మందిపై అభియోగాలు నమోదు చేశారు. వారిలో ఇద్దరు భారత్లో జైళ్లలో ఉంటూనే తమ అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్లను నడిపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
నిజ్జర్ హత్యకు పంజాబ్కు చెందిన లారెన్స్ బిష్ణోయీ, సతీందర్జిత్ అలియాస్ గోల్డీ బ్రార్ ఆదేశాలిచ్చినట్టు అమెరికా అభియోగపత్రంలో ఉంది.
లారెన్స్ బిష్ణోయీ ప్రస్తుతం గుజరాత్లోని అహ్మదాబాద్ సబర్మతి జైలులో ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా, కెనడాల్లో కాంట్రాక్ట్ హత్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, కిడ్నాప్లు, వసూళ్లు, ఆయుధాల అక్రమ రవాణా, ఇతర నేర కార్యకలాపాలు నిర్వహించినట్టు 17 మంది నిందితులపై జూన్ 25న ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ సమర్పించిన ఏడు అంశాల అభియోగపత్రంలో ఆరోపించారు.
అంతర్జాతీయ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లు, హత్యలు, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తదితర కేసులకు సంబంధించిన అమెరికా అభియోగపత్రాల్లో లారెన్స్ బిష్ణోయీ, జగ్గూ భగవాన్పురియా పేర్లు ప్రముఖంగా ఉన్నాయి.
భారత్లో జైళ్లలో ఉన్న నేరస్తులను తమకు అప్పగించాలని అమెరికా కోరితే భారత్ ముందున్న మార్గాలేంటి? భారత్ వారిని అమెరికాకు అప్పగిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
అయితే, దీనికి సమాధానం అవుననే చెప్పాలి. కాకపోతే ఈ ప్రక్రియ సుదీర్ఘంగా, సంక్లిష్టంగా ఉండే అవకాశం ఉంది.
భారత్ - అమెరికా మధ్య ఒప్పందం
భారత్, అమెరికా మధ్య 1997లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరింది.
భారత రాయబార కార్యాలయ వెబ్సైట్ ప్రకారం, ఈ ఒప్పందం కింద ఒక వ్యక్తిపై మోపిన నేరం అమెరికా, భారత్ రెండు దేశాల చట్టాల ప్రకారమూ నేరంగా పరిగణించదగినదై, కనీసం ఏడాది జైలు శిక్ష విధించదగినదై ఉండాలి.
దౌత్య మార్గాల ద్వారా అధికారిక అప్పగింత అభ్యర్థన పంపిస్తారు. ఈ ఒప్పందం ప్రకారం నేరస్తుల అప్పగింతకు కొన్ని నిర్దిష్ట నిబంధనలున్నాయి.
సాధారణంగా అభియోగపత్రం, అరెస్ట్ వారెంట్, నేరానికి సంబంధించిన పూర్తి వివరాలు, సంబంధిత చట్టాలు, వర్తించే న్యాయ నిబంధనలు, శిక్షలు, అలాగే ఆ వ్యక్తిపై విచారణ చేపట్టడానికి అవసరమైన ఆధారాలు లేదా సమాచారం అందులో ఉండాలి.
ఒకవేళ ఆ వ్యక్తి ఇప్పటికే కోర్టులో దోషిగా తేలితే, అప్పగింత అభ్యర్థనతో పాటు తీర్పు పత్రాన్ని లేదా ఆ వ్యక్తిని దోషిగా నిర్ధరిస్తూ న్యాయాధికారి ఇచ్చిన ధ్రువీకరణను జతచేయాలి.
ఈ అంశంపై క్రిమినల్ వ్యవహారాల నిపుణులు అడ్వకేట్ నిఖిల్ సరాఫ్ బీబీసీతో మాట్లాడారు.
"ఈ రెండు దేశాల మధ్య అప్పగింత ఒప్పందం ఉంది. దాని ప్రకారం అమెరికా అధికారికంగా భారత్కు అభ్యర్థన పంపవచ్చు. అనంతరం భారత కోర్టులు, ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకుంటాయి."
"ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. అయితే, ప్రభుత్వం ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటుందనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. వారిని అప్పగించాలని ప్రభుత్వం భావిస్తే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. వారిని అప్పగించడానికి ప్రభుత్వం ఇష్టపడకపోతే ఇలాంటి కేసులు ఎన్నో సంవత్సరాలు సాగుతాయి. అప్పగించడం అనేది వెంటనే జరిగే ప్రక్రియ కాదు" అని నిఖిల్ సరాఫ్ తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES/ANI
కెనడాలో హత్య జరిగితే, అమెరికాలో కేసు ఎలా?
ప్రపంచవ్యాప్తంగా నేర కార్యకలాపాలు నిర్వహించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై 'ఆపరేషన్ హార్డ్బాల్' కింద అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) మూడు అభియోగపత్రాలు దాఖలు చేశాయి.
అమెరికా, కెనడా, యూరప్ దేశాల చట్టపరమైన సంస్థలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
కెనడాలో ఉంటున్న ఖలిస్తానీ కార్యకర్త హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను కూడా ఈ చార్జ్షీట్లో చేర్చారు.
ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయీ, గోల్డీ బ్రార్ ఆదేశాలిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో గురుద్వారా నుంచి బయటకు వస్తుండగా ఇద్దరు దుండగులు నిజ్జర్ను కాల్చిచంపారు.
మత, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడటంతో పాటు ప్రజల నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేయడానికి బిష్ణోయీ ముఠా ప్రయత్నించిందని న్యాయవాదులు ఆరోపించారు.
కాలిఫోర్నియాలోని బాధితుల నుంచి బిష్ణోయీ, బ్రార్, ఇతర నిందితులు బలవంతపు వసూళ్లకు ప్రయత్నించినట్లు కూడా ఆరోపణలున్నాయి.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడాలో జరిగితే అమెరికా కోర్టులు జోక్యం చేసుకుని నిందితులపై చర్యలు తీసుకోగలవా? అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సమాధానం అవుననే చెప్పాలి.
అమెరికా అభియోగపత్రం ప్రకారం, ఈ గ్యాంగ్ అమెరికాలో బలవంతపు వసూళ్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర వ్యవస్థీకృత నేరాలకు పాల్పడింది.
అందువల్ల నిజ్జర్ హత్య కెనడాలో జరిగినప్పటికీ అది ఈ గ్యాంగ్ కార్యకలాపాల్లో భాగమని అమెరికా వాదిస్తోంది. ఆ ఆధారాలతో అమెరికా కోర్టులు దీనిని ఈ కేసు తమ విచారణలో భాగంగా పరిగణించచ్చు.
అమెరికా చట్టాల ప్రకారం, నేరం తప్పనిసరిగా అమెరికా భూభాగంలోనే జరగాల్సిన అవసరం లేదు.
ఒక నేర ముఠా కార్యకలాపాలకు అమెరికాతో సంబంధం ఉంటే, కొన్ని సందర్భాల్లో విదేశాల్లో జరిగిన నేరాలపైనా అమెరికా చట్టాల ప్రకారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
ఉదాహరణకు లాస్ ఏంజెలెస్లో బలవంతపు వసూళ్ల బెదిరింపులు జరిగినా, అమెరికా-కెనడా సరిహద్దు మీదుగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరిగినా అమెరికా వాటిని విచారించచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ గ్యాంగ్ లీడర్లపై అమెరికా ఎందుకు అభియోగాలు మోపింది?
చార్జ్షీట్లో నిందితులపై కుట్ర, హాబ్స్ చట్టం కింద బలవంతపు వసూళ్లకు యత్నం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, లైసెన్సు లేకుండా తుపాకుల అక్రమ రవాణా, మెషీన్ గన్ కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపారు.
అమెరికా భూభాగంలో నిందితులు నేర కార్యకలాపాలు నిర్వహించారని, ఈ ముఠాలకు చెందిన అనేక మంది సభ్యులు అమెరికాలో ఉన్నారని అభియోగపత్రంలో పేర్కొన్నారు.
అక్రమంగా తరలించిన మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఆధారిత వాయిస్ ప్రోటోకాల్ పరికరాల ద్వారా జైలు నుంచే లారెన్స్ బిష్ణోయీ ప్రపంచవ్యాప్త నేర ముఠాను నడిపించారని ఎఫ్బీఐ తన అభియోగపత్రంలో ఆరోపించింది.
కెనడాలో జరిగిన హత్య కేసుతో పాటు అమెరికాలో జరిగిన తీవ్రమైన నేరాల్లోనూ వీరిపై అమెరికన్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.
అమెరికా పరిధికి వెలుపల ఉన్న ముఠా నాయకులకు అమెరికాతో సంబంధాలు ఉన్నాయని, వారి అనుచరుల్లో అనేక మంది ఇక్కడే నేర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అభియోగపత్రంలో పేర్కొన్నారు.
అందుకే అంతర్జాతీయ నేరాలను అరికట్టేందుకు భాగస్వామ్య దేశాల న్యాయ సంస్థలతో కలిసి అమెరికా ఈ చర్యలు చేపట్టిందని తెలిపింది.
"అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం, పలు దేశాల న్యాయ సంస్థలు కలిసి నేరస్తులు కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేంద్రాలనే లక్ష్యంగా చేసుకోవడం" అని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ కమిషనర్ మైక్ దుహైమ్ చెప్పినట్టు అమెరికా అటార్నీ కార్యాలయం వెబ్సైట్ తెలిపింది.
" హత్యలు, బెదిరింపులతో కెనడా, అమెరికాలోని ప్రజల నుంచి డబ్బు వసూలు చేసే వ్యవస్థీకృత నేరగాళ్ల కార్యకలాపాలను మేం సమష్టిగా అడ్డుకున్నాం. కెనడా, అమెరికా, ప్రపంచవ్యాప్తంగా ప్రజల భద్రత కోసం మా వంతు కృషిని కొనసాగిస్తాం."

ఫొటో సోర్స్, @NIA_India
భారత్ - అమెరికా వ్యూహాత్మక సంబంధాలపై ప్రభావం చూపుతుందా?
ఈ విషయం గురించి గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాల విభాగాధిపతి డాక్టర్ రాజేశ్ కుమార్తో బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ రవీందర్ సింగ్ రాబిన్ ప్రత్యేకంగా మాట్లాడారు.
ఈ కేసులో భారత్ అప్పగింతకు అంగీకరిస్తే అమెరికాతో సంబంధాలు మరింత మెరుగుపడతాయని డాక్టర్ రాజేశ్ కుమార్ భావిస్తున్నారు.
"ఇక్కడ రెండు దేశాలు నిందితులను అప్పగించుకోవలసి ఉంటుంది. ఖలిస్తాన్ వంటి అంశాల విషయంలో భారత్ ఎంత సున్నితంగా వ్యవహరిస్తుందో అమెరికా ప్రభుత్వానికీ తెలుసు."
"ఇలాంటి విషయాలకు గతంలో కూడా కొన్ని ఉదాహరణలున్నాయి. ఈ విషయాల్లో అమెరికా సహకరించకపోతే లేదా అలాంటి వర్గాలకు మద్దతిస్తున్నట్టు కనిపిస్తే, అమెరికా భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని చెప్పడానికి ప్రతిపక్షాలకు ఒక పెద్ద అవకాశం లభిస్తుంది. అయితే, ఇరుదేశాలు అప్పగింత ఒప్పందాన్ని గౌరవించాల్సి ఉంటుంది" అని ఆయన విశ్లేషించారు.
డేవిడ్ హెడ్లీ కేసును ఉదహరించిన ఆయన ఈ కేసు కూడా అలాగే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
"డేవిడ్ హెడ్లీ కేసులో భారత్కు అమెరికా సహకరించింది. ఇప్పుడు దానిని విస్మరించలేం. కాబట్టి అప్పగింత జరిగితే అది రెండు దేశాలను మరింత దగ్గరచేసే కీలక పరిణామం అవుతుంది" అని రాజేశ్ కుమార్ చెప్పారు.
2008 ముంబై దాడుల కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన డేవిడ్ హెడ్లీని భారత్కు అమెరికా అప్పగించనప్పటికీ అమెరికా జైలులోనే ఉంచి ఈ కేసులో భారత దర్యాప్తు సంస్థలకు విచారణలో సహకరించేలా చేసింది.
అదే కేసులో మరో నిందితుడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను భారత్కు అప్పగించింది.
2025 ఏప్రిల్ 10న రాణాను ప్రత్యేక విమానంలో దిల్లీకి తీసుకువచ్చారు. అక్కడ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆయన్ను అధికారికంగా అరెస్టు చేసింది. ఆయన్ను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపర్చగా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





























