లైవ్, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు: ధర్మేంద్ర ప్రధాన్

‘చర్చకు మేం సిద్ధమే అని ప్రభుత్వం చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించడానికి బదులుగా రాజకీయ ప్రదర్శననే ఎంచుకుంది. వారి లక్ష్యం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కాదు, అడ్డంకులు సృష్టించడమే. రాహుల్ గాంధీకి ఇది విద్యార్థులకు సంబంధించిన విషయం కాదు.. చర్చకు సరైన మార్గం ఇప్పటికే ఏర్పడినా సంఘర్షణ సృష్టించే ప్రయత్నమే ఇది’ అంటూ ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

సారాంశం

  • దిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని నివాసం ఎదుట విపక్ష నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులను దిల్లీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
  • రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఇతర విపక్ష నేతలను పోలీసులు మొదట ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు. ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
  • అనంతరం మంగళవారం రాత్రి పోలీసులు రాహుల్ గాంధీని విడిచిపెట్టారు. తర్వాత ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి ఒక వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్, ఇతర విపక్ష నేతలనూ విడిచిపెట్టారు.
  • రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు.
  • మంగళవారం జరిగిన పరిణామాలపై మంగళవారం రాత్రి 11.35 గంటలకు 'ఎక్స్' వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఛత్రసాల్ స్టేడియం నుంచి మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఆ వీడియోలో రాహుల్ గాంధీ.. విపక్షాలన్నీ బుధవారం ఈ వ్యవహారంపై పార్లమెంటులో చర్చ జరగాలని కోరుకుంటున్నాయని చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు: ధర్మేంద్ర ప్రధాన్

    Dharmendra Pradhan

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.

    రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి బయట ధర్నా చేయడంతో సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

    మంగళవారం రాత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన.. ‘లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ... పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించడానికి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను వాడుకుంటున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలకు అసౌకర్యం కలగించడమే కాకుండా భద్రత నిబంధనలనూ ఉల్లంఘించారు’ అని రాశారు.

    ‘పూర్తిస్థాయి చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్య చర్చకు బదులుగా రాజకీయ ప్రదర్శననే ఎంచుకుంది. వారి లక్ష్యం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కాదు, అడ్డంకులు సృష్టించడమే’ అని రాశారు.

    ‘నీట్ పరీక్షపై పార్లమెంట్‌లో చర్చించడానికి, యువత ఆందోళనలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. భారతదేశ విద్యార్థులను ఒక రాజకీయ ప్రచారంలో భాగం చేయడం కంటే మెరుగైన రీతిలో చూడాలి. వారికి కావాల్సింది నమ్మకం.. అంతేకానీ గందరగోళం కాదు. వారికి కావాల్సింది పరిష్కారాలు.. నినాదాలు కాదు. వారికి కావాల్సింది జవాబుదారీతనం, అడ్డంకులు కాదు’ అన్నారు దేవేంద్ర ప్రధాన్.

    విద్యార్థుల సమస్యలపై పనిచేయడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.

  2. నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్టేడ్ చేస్తాం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    బీబీసీ న్యూస్ తెలుగు వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన వార్తలను ఇక్కడ చదవొచ్చు.