లైవ్, ప్రధాని నివాసం వద్ద ధర్నాకు దిగిన రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి భేటీ

దిల్లీలోని ప్రధానమంత్రి నివాసం '7 లోక్ కల్యాణ్ మార్గ్' వెలుపల రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం జవాబుదారీతనం వహించడానికి ఇష్టపడట్లేదని రాహుల్ ఆరోపించారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి ఆయనను కలిశారు.

సారాంశం

  • జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్‌ను నిరసిస్తూ దిల్లీలోని ప్రధాని ఇంటి ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాకు దిగింది.
  • భారతదేశ యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోంమంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ అన్నారు.
  • సీజేపీ సోమవారం చేపట్టిన నిరసనల తరువాత అభిజీత్ దీప్కే తన మద్దతుదారులకు క్షమాపణలు చెప్పారు.
  • అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులు నిర్వహించిన 'పార్లమెంట్ మార్చ్' సందర్భంగా జరిగిన లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ వాడకంపై ఆందోళన వ్యక్తం చేసింది.
  • సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు.
  • సీజేపీ నిరసనలపై బాలీవుడ్ నటులు సోనూ సూద్, రితేష్ దేశ్‌ముఖ్, రణ్‌వీర్ షోరే, జెనీలియా తదితరులు స్పందించారు.

లైవ్ కవరేజీ

  1. ప్రధాని నివాసం వద్ద ధర్నాకు దిగిన రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి భేటీ

    ప్రధాని నివాసం, రాహుల్ గాంధీ ధర్నా, కాంగ్రెస్

    ఫొటో సోర్స్, @INCIndia

    ఫొటో క్యాప్షన్, దిల్లీలోని '7 లోక్ కళ్యాణ్ మార్గ్‌' వద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంపీలు

    దిల్లీలోని ప్రధానమంత్రి నివాసం '7 లోక్ కల్యాణ్ మార్గ్' వెలుపల రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నాకు దిగారు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోంమంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

    కాగా, ప్రధాని నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలను కలవడానికి కొద్దిసేపటి కిందట కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అక్కడకు చేరుకున్నారు. ధర్నా స్థలం నుంచి వస్తున్న దృశ్యాలలో జితేంద్ర సింగ్, రాహుల్ గాంధీతో మాట్లాడుతుండటం కనిపించింది.

    రాహుల్ గాంధీ 'ఎక్స్'లో పోస్ట్ చేస్తూ "నిన్న విద్యార్థులపై జరిగిన క్రూరమైన దాడికి సంబంధించి ప్రధాని మోదీ నుంచి సమాధానం రాబట్టేందుకు మేం ఆయన ఇంటి వరకు మార్చ్ నిర్వహించాం. ప్రభుత్వం జవాబుదారీతనం వహించడానికి ఇష్టపడట్లేదు. పార్లమెంట్‌లో దీనిపై చర్చను కూడా కోరుకోవట్లేదు. దేశ యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోంమంత్రి రాజీనామా చేయాలి" అని తెలిపారు.

    మరోవైపు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనను కొనసాగిస్తోంది. సీజేపీ చేపట్టిన 'పార్లమెంట్ మార్చ్' పై సోమవారం లాఠీచార్జ్ జరిగింది. ఈ ఘటనలో పలువురు యువకులు గాయపడ్డారు.

    ఈ నేపథ్యంలో, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారి ఒక ప్రకటన చేశారు. అయితే, ఈ ప్రకటన ప్రధాని మోదీ నుంచి నేరుగా రాలేదు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ద్వారా వచ్చింది.

  2. నీట్ పేపర్ లీకేజీపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, Ajay Aggarwal/Hindustan Times via Getty Images

    వర్షాకాల సమావేశాల రెండో రోజైన మంగళవారం.. ఎన్డీఏ ఎంపీలతో నిర్వహించిన 'మంగళ్ మిలన్'లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రభుత్వ వైఖరిని తెలియజేశారు.

    సమావేశం అనంతరం, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి ప్రసంగం గురించి మీడియాకు తెలియజేశారు.

    ‘నీట్ పరీక్షకు సంబంధించి, అవకతవకలు జరిగినట్లు నివేదికలు అందిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుందని, పదమూడు మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ప్రధానమంత్రి చెప్పారు" అని కిరణ్ రిజిజు చెప్పారు.

    ‘విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యమిస్తూ పరీక్ష మళ్లీ నిర్వహించి, ఎలాంటి ఆలస్యం లేకుండా ఫలితాలను ప్రకటించామని ప్రధాని మోదీ అన్నారు. పేపర్ లీక్ వంటి సంఘటనలను నివారించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఆయన తెలిపారు’ అని రిజిజు చెప్పారు.

    పేపర్ లీక్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు తెలుపుతున్న సందర్భంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  3. సిక్కిం: సొరంగ నిర్మాణంలో ప్రమాదం.. 8 మంది మృతి

    గౌహతి, సొరంగ మార్గంలో ప్రమాదం

    ఫొటో సోర్స్, Namchi District Admin

    ఫొటో క్యాప్షన్, గౌహతిలో సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయని అధికారులు తెలిపారు.

    సిక్కింలోని నామ్చి జిల్లాలోని సమర్‌దుంగ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదం తర్వాత ఇప్పటివరకు 8 మృతదేహాలను వెలికితీశారు.

    ఎన్‌హెచ్‌పీసీకి చెందిన తీస్తా జలవిద్యుత్ ప్రాజెక్టులో భాగంగా ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు.

    సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని నామ్‌చి జిల్లా డిప్యూటీ కమిషనర్ అనుప తమ్లింగ్ తెలిపారు.

    సోమవారం కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. సొరంగంలోని కొంత భాగం కూలిపోవడంతో లోపలకు వెళ్లే దారి మూసుకుపోయింది. సొరంగంలో గ్యాస్ లీక్ అవ్వడంతో సహాయ చర్యలు కష్టంగా మారాయని అధికారులు చెబుతున్నారు

    “సంబంధిత శాఖల నుండి అందిన సమాచారం ప్రకారం సొరంగంలో కనీసం 25 మంది చిక్కుకుపోయారు. లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక బృందాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి” అని జిల్లా డిప్యూటీ కమిషనర్ బీబీసీతో చెప్పారు.

    సొరంగంలో చిక్కుకున్న కార్మికులు చాలా దూరంలో ఉన్నారని, అక్కడ ఆక్సిజన్ కొరత గ్యాస్ లీకేజీ సమస్య ఉందని అనుప తమ్లింగ్ తెలిపారు.

  4. కాక్రోచ్ పార్టీ నిరసనలపై బాలీవుడ్ నటులు ఏమన్నారంటే

    కాక్రోచ్ జనతా పార్టీ, పార్లమెంట్ మార్చ్, సినీ ప్రముఖులు

    ఫొటో సోర్స్, Getty Images

    కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ అనంతరం సినీ నటులు కొందరు ఈ నిరసనకు మద్దతు పలికారు.

    నటులు సోనూసూద్, రితేష్ దేశ్‌ముఖ్, రణ్‌వీర్ షోరే, నటి జెనీలియా సహా పలువురు సెలబ్రిటీలు స్పందించారు.

    మన విద్యార్థులకు కర్రలు అవసరం లేదు. వారిని కౌగిలించుకునే చేతులు కావాలిఅని నటుడు సోనూసూద్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

    దేశ యువతకు మేము అండగా నిలుస్తాం. వారి గొంతు తప్పకుండా వినిపించాలి. దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దేది వాళ్లే. మనం వారి మాట విందాం. వారికి అండగా ఉందాం. ముందుకు సాగడానికి వారికి అవకాశం ఇద్దాం. మన యువత శక్తి, ధైర్యం మనం కోరుకునే దేశ నిర్మాణంలో సాయపడతాయిఅని రితేశ్ దేశ్‌ముఖ్, ఆయన భార్య జెనీలియా అన్నారు.

    మంత్రి ఎప్పుడో రాజీనామా చేసి ఉండాల్సి. అలా చేసి ఉంటే ప్రభుత్వం పరువు నిలబడి ఉండేది. ఇప్పుడు ప్రతిపక్షానికి ప్రయోజనం చేకూర్చకుండా లేదా తనకు తానే సమస్యలు సృష్టించుకోకుండా ఈ పరిస్థితి నుండి బయటపడగలదని నేను అనుకోవడం లేదుఅని నటుడు రణవీర్ షోరే ఎక్స్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.

    కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు మద్దతుగా నటి భూమి పెడ్నేకర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు

    ఏ సమస్యకూ హింస పరిష్కారం కాదు. ఈరోజు మనం హింసాత్మక దృశ్యాలను చూశాం. ఈ ఉద్యమంలో యువత హింసకు పాల్పడకుండా, దాని మార్గం నుండి పక్కకు తప్పుకోకుండా చూడటం మన బాధ్యత. ప్రజాస్వామ్యాలు చర్చలు, సంప్రదింపులపై ఆధారపడి ఉంటాయి. బలహీన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు జీవితంలో పైకి ఎదగడానికి విద్య ఒక్కటే మార్గం.ఈ నమ్మకాన్ని మనం వమ్ము కానివ్వకూడదుఅని ఆమె అందులో రాశారు.

  5. పార్లమెంట్ మార్చ్ తర్వాత అభిజీత్ దీప్కే తమ మద్దతుదారులకు క్షమాపణ ఎందుకు చెప్పారు?

    దిల్లీ పోలీసుల అణచివేత నుంచి మద్దతుదారులను రక్షించేందుకు తాము ఇంకా మెరుగ్గా పని చేసి ఉంటే బావుండేదని అభిజీత్ దీప్కే అన్నారు.

    ఫొటో సోర్స్, Sanjeev Verma/Hindustan Times via Getty Images

    ఫొటో క్యాప్షన్, కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

    దిల్లీ పోలీసుల అణచివేత నుంచి నిరసనకారులను రక్షించేందుకు తామింకా మెరుగ్గా వ్యవహరించి ఉండాల్సిందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. తమ మద్దతుదారులకు ఆయన క్షమాపణలు చెప్పారు.

    నా మద్దతుదారులందరికీ, ముఖ్యంగా పోలీసు అధికారుల చేతిలో దెబ్బలు తిన్న అమ్మాయిలకు క్షమాపణలు చెబుతున్నాను. మేం ఇంకా మెరుగ్గా చేసి ఉండాల్సింది. దిల్లీ పోలీసుల అమానుష చర్యల నుండి మిమ్మల్ని కాపాడటానికి నేను ఇంకా బాగా పని చేసి ఉండాల్సింది” అని ఆ సందేశంలో తెలిపారు.

    “20 మందికి పైగా విద్యార్థుల మరణానికి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడటం కోసం ప్రభుత్వం మరెంతో మంది యువ విద్యార్థుల రక్తాన్ని చిందించడానికి సిద్ధపడింది. మీరు గాయపడి ఇది చూస్తున్నట్లయితే, నాకు మెసేజ్ చేయండి. నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను” అని అభిజీత్ దీప్కే తన సందేశంలో పేర్కొన్నారు.

    తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు.

    సోమవారం సీజేపీ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు, వారిపై లాఠీచార్జ్ చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఈ సంఘటనల్లో అనేక మంది గాయపడ్డారు.

    నిరసనకారులపై లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసు చర్యలకు సంబంధించిన అనేక వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.

  6. సీజేపీ నిరసనకారులపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంపై హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన

    cjp protest

    ఫొటో సోర్స్, Getty Images

    కాక్రోచ్ జనతా పార్టీ దిల్లీలో చేపట్టిన నిరసన, పార్లమెంట్ మార్చ్ సందర్భంగా వారిపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ వాడకంపై హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది.

    పోలీసుల చర్యపై విచారణ జరిపి, నిరసనకారుల హక్కులను పరిరక్షించాలని ఆ సంస్థ భారత అధికారులకు విజ్ఞప్తి చేసింది.

    ‘దిల్లీలో నిరసన చేస్తున్న వేలాది మంది విద్యార్థులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు లాఠీలు, టియర్ గ్యాస్ ఉపయోగించాయన్న ఆరోపణలపై భారత అధికారులు తక్షణమే విచారణ జరపాలి" అని హ్యూమన్ రైట్స్ వాచ్ఆసియా డిప్యూటీ డైరెక్టర్ మీనాక్షి గంగూలీ అన్నారు.

  7. నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.