'భార్య శవాన్ని జంతువులను కాల్చేసే యంత్రంలో పడేశా’నన్న జూ ఉద్యోగి, తర్వాత ఏమైంది?

    • రచయిత, కోహ్ ఈవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 3 నిమిషాలు

తన భార్య మృతదేహాన్ని జూలో జంతు కళేబరాలను కాల్చేసే యంత్రం(ఇన్సినరేటర్)లో పడేసినట్లు జపాన్‌లోని ఓ ప్రముఖ జూ ఉద్యోగి పోలీసులకు చెప్పినట్లు స్థానిక మీడియా తెలిపింది.

అసహికావా నగరంలోని అసహియామాలోని ఈ జూలో నిర్వహణ పనుల కోసం మూడు వారాలు విరామం తీసుకున్నారు. విరామానంతరం, జపాన్ గోల్డెన్ వీక్ సెలవులకు అనుగుణంగా సందర్శకుల కోసం ఈ జూ తెరుచుకోవాల్సి ఉంది.

కానీ, ఉద్యోగి భార్య మృతదేహం పడేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండడంతో జూను శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు నగర పాలకవర్గం తెలిపింది.

గతవారం, జూలోని ఇన్సినరేటర్‌లో తన భార్య మృతదేహాన్నిపడేసినట్లు జూ ఉద్యోగి చెప్పడంతో పోలీసులు జూ ప్రాంగణంలో సోదాలు జరిపినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.

చనిపోయిన జంతు కళేబరాలను దహనం చేసేందుకు ఈ యంత్రాన్ని వినియోగిస్తారు.

స్థానిక వార్తా కథనాల ప్రకారం, తన స్నేహితురాలు(జూ ఉద్యోగి భార్య) కనిపించడం లేదని ఒక మహిళ ఫిర్యాదు చేసినప్పటి నుంచి పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన జూలలో అసహియామా జూ కూడా ఒకటి. ఇది 1967లో ప్రారంభమైంది. ఈ జూలో సందర్శకులు జంతువులను అతి సమీపం నుంచి చూసేలా గ్లాస్ డోమ్‌లు, పైకప్పులో బోన్లు వంటి ప్రత్యేక ఏర్పాట్లున్నాయి.

ఏటా దాదాపు 10 లక్షలకు పైగా సందర్శకులు వస్తుంటారు. వేసవి సీజన్‌కు ముందు నిర్వహణ పనుల కోసం ఏప్రిల్ 8న దీనిని మూసేశారు.

సందర్శకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ అధికారులు ప్రకటన చేశారు. దర్యాప్తుకు అవసరమైతే, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా జూను మూసివేసే అవకాశం ఉందని వారు తెలిపారు.

అసహికావా మేయర్ హిరోసుకే ఇమాజు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, "ఊహించని సంక్షోభం" తలెత్తిందని, పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

"ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేరు" అని ఆయన అన్నారు.

"త్వరలోనే మీకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పార్కుకు మునుపటిలానే సందర్శకులు తరలివస్తారని ఆశిస్తున్నాం."

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)