పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం సహా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆయా ప్రాంతాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపునకు కావాల్సిన అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకున్నారు.
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఒకే విడతలో ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. తమిళనాడులో కూడా ఒకే విడతలో ఏప్రిల్ 23న ఓటింగ్ ముగిసింది.
పశ్చిమ బెంగాల్లో పోలింగ్ రెండు దశల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరిగింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
పశ్చిమబెంగాల్లో విజయం తమదేనని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భట్టాచార్య ధీమా వ్యక్తం చేశారు.
లైవ్ కవరేజీ
పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు ఏమంటున్నారు?
ఫొటో సోర్స్, Samir Jana/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, గెలుపు బీజేపీదే
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ధీమా వ్యక్తం చేశారు.
‘‘ఇప్పటికే రాష్ట్ర ప్రజలు టీఎంసీని తిరస్కరించారు’’ అని ఆయన చెప్పారు.
‘‘మరికొన్ని గంటల్లో ప్రజలకు, మమతా బెనర్జీకి మధ్య జరిగిన పోటీలో భారీ మెజార్టీ ఎవరిదో తేలిపోతుంది. ఇప్పటికే ప్రజలు ఆమెను తిరస్కరించారు’’ అన్నారు భట్టాచార్య.
పశ్చిమబెంగాల్లో ఉదయం 8గంటలకు 293 స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఫలితాల తొలిదశ సరళి బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరును సూచిస్తున్నాయి.
వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ చూస్తుండగా, తొలిసారి అధికార పీఠం దక్కుతుందని బీజేపీ ఆశలుపెట్టుకుంది.
అధికారం దక్కాలంటే ఏ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ ఏంటి?
నాలుగురాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరి ఆయా రాష్ట్రాలలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజార్టీ సాధనకు ఎన్నిసీట్లు రావాలో ఇక్కడ చూడండి.
తమిళనాడు అసెంబ్లీ స్థానాలు : 234
మెజారిటీకి అవసరమైన సీట్లు: 118
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్థానాలు : 294
మెజారిటీకి అవసరమైన సీట్లు: 148
( ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ కారణంగా, ప్రస్తుతం 293 స్థానాలకు మాత్రమే లెక్కింపు జరుగుతోంది)
అస్సాం అసెంబ్లీ స్థానాలు: 126
మెజారిటీకి అవసరమైన సీట్లు: 64
కేరళ అసెంబ్లీ స్థానాలు : 140
మెజారిటీకి అవసరమైన సీట్లు: 71
పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలు: 30
మెజారిటీకి అవసరమైన సీట్లు: 16
ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- అందరి దృష్టి బెంగాల్పైనే
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, కోల్కతా నగరంలో పహారా కాస్తున్న భద్రతా బలగాలు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
నెల్లాళ్లపాటు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. హోరాహోరీ పోరులో గెలుపెవరిదో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. పశ్చిమబెంగాల్లో అటు అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇటు భారతీయ జనతాపార్టీ చావోరేవో అన్నట్టుగా తలపడ్డాయి.
పశ్చిమబెంగాల్తోపాటు దక్షణాదిన తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి,ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోనూ ఎన్నికలు జరిగాయి. కానీ దేశవ్యాప్తంగా అందరి దృష్టి పశ్చిమబెంగాల్పైనే ఉంది.
ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు పతాకశీర్షికలుగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఓటర్ల జాబితా సవరణ కారణంగా దాదాపు 91 లక్షల ఓటర్లను తొలగించారు.
ఇక నాలుగోసారి మమతాబెనర్జీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్నది కూడా మే 4వ తేదీనే తేలిపోనుంది.
మరోపక్క ఎలాగైన పశ్చిమబెంగాల్లో పాగా వేయాలని బీజేపీ దీర్ఘకాలంగా ఎదురుచూస్తోంది. ఈసారి అధికారం చేజిక్కించుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా శ్రమించింది.
మరికొద్ది గంటల్లోనే ఫలితాలు తేలిపోనున్న తరుణంలో కోల్కతా నగరం ప్రశాంతంగా కనిపిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాలలో కేంద్రబలగాలు, రాష్ట్ర పోలీసులను మోహరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల బయట భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరోపక్క తాజాగా ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ జరపనున్నట్టు ప్రకటించారు.
ఈ నియోజకవర్గ ఫలితాన్ని మే 24న ప్రకటించనున్నారు.
దీంతో మే 4వ తేదీ పశ్చిమబెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాలకు గానూ, 293 స్థానాల ఫలితాలు మాత్రమే వెల్లడికానున్నాయి.
, గుడ్మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు స్థానిక, జాతీయ,
అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.