You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

లైవ్, అత్తని 9 కిలోమీటర్లు మోసుకెళ్లిన కోడలు

తొంభై ఏళ్లున్న తన అత్తను కోడలు వీపుపై మోసుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా, మైన్‌పాట్ ప్రాంతంలోని జంగల్‌పారాలో జరిగింది.

సారాంశం

  • తొంభై ఏళ్లున్న తన అత్తను కోడలు వీపుపై మోసుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా, మైన్‌పాట్ ప్రాంతంలోని జంగల్‌పారాలో జరిగింది.
  • టాలీవుడు నటుడు రామ్ చరణ్ భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.
  • పాకిస్తాన్: క్వెట్టాలో రైల్వే ట్రాక్‌పై పేలుడు, 20 మంది మృతి
  • త్విషా శర్మ మృతి కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి రేపు విచారణ జరపాలని నిర్ణయించింది.
  • వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిగాయి. స్థానిక సమయం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
  • భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో అనుమానితుడి మృతి
  • 21 ఏళ్ల నాసిరే బెస్ట్ కాల్పులు జరిపినట్లుగా గుర్తింపు
  • వైట్ హౌస్ పరిసరాల్లో భారీగా భద్రతా బలగాల మోహరింపు

లైవ్ కవరేజీ

  1. అత్తని 9 కిలోమీటర్లు మోసుకెళ్లిన కోడలు, అలోక్ పుతుల్, బీబీసీ కోసం, రాయ్‌పూర్ నుంచి..

    ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా, మైన్‌పాట్ ప్రాంతంలోని జంగల్‌పారా గ్రామంలో హృదయవిదారక దృశ్యమొకటి వెలుగులోకి వచ్చింది.

    పింఛన్ కోసం ఒక మహిళ 90 ఏళ్లున్న తన అత్తను వీపుపై మోసుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది.

    సోమారి బాయి గిరిజన మహిళ. ఆమెకు రావాల్సిన రూ.1500 పెన్షన్ సొమ్ము గత మూడు నెలలుగా రావడం లేదు. దీంతో కోడలు రుక్మిణియా తన అత్తని వీపుపై మోసుకుంటూ రాళ్లురప్పలు, వాగులు దాటుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని సెంట్రల్ బ్యాంకుకు తీసుకెళ్లారు.

    వాళ్ల ఊరికి సరైన రోడ్డు మార్గం గానీ, రవాణా సౌకర్యాలు గానీ లేవు.

    సోమారి బాయి బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆ ఖాతా సేవలు నిలిచిపోయాయని బ్యాంక్ మేనేజర్ అల్తాఫ్ మీర్జా తెలిపారు. ప్రస్తుతం ఆ అకౌంట్‌కు సంబంధించిన కేవైసీ, మొబైల్ నంబర్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది.

    ఇకపై బ్యాంక్ మిత్ర ద్వారా పింఛన్ సొమ్ము నేరుగా వృద్ధురాలి ఇంటికే వెళ్లి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

    ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ గ్రామానికి చేరుకుని ఆరా తీశారు. సోమారి బాయి పింఛను విత్‌డ్రా చేసే అవకాశం ఆమె కోడలు రుక్మిణియాకు కల్పించనున్నట్లు మైన్‌పాట్ ఎస్డీఎం ఫగేశ్ సిన్హా తెలిపారు.

  2. బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్

    టాలీవుడు నటుడు రామ్ చరణ్.. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.

    త్వరలో విడుదల కానున్న తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ రామ్ చరణ్ పొరపాటున జస్ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ఆటగాడిగా సంబోధించారు.

    ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా బుమ్రాకు క్షమాపణలు తెలిపారు.

    రామ్ చరణ్ శనివారం రాత్రి ఎక్స్‌లో చేసిన పోస్టులో ఇలా రాశారు. "అయ్యో... నేను నిజంగా కొన్నిసార్లు పేర్లు మర్చిపోతుంటాను."

    "జస్ప్రీత్ బుమ్రా గారు, జరిగిన పొరపాటుకు నేను క్షమాపణలు చెబుతున్నా. అంతమంది జనంలో, కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా జరిగిన మానవ తప్పిదమిది."

    "నాకు మీరంటే చాలా గౌరవం. మీ ఆటకు పెద్ద అభిమానిని. మీరు నిలకడగా రాణిస్తూ, బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపిస్తున్నప్పుడు ప్రతి భారతీయుడూ గర్వపడతాడు" అని రామ్ చరణ్ రాశారు.

  3. పాకిస్తాన్: క్వెట్టాలో రైల్వే ట్రాక్‌పై పేలుడు, 20 మంది మృతి

    పాకిస్తాన్‌లోని క్వెట్టాలో చమన్ గేట్ దగ్గర రైల్వే ట్రాక్‌లపై ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.

    పేలుడు కారణంగా రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పగా రెండు బోగీలు బోల్తా పడ్డాయి.

    పేలుడు తీవ్రతకు రైల్వే ట్రాక్ దగ్గర నిలిపి ఉంచిన అనేక వాహనాలతో పాటు సమీపంలోని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

    ప్రస్తుతం ఘటనా స్థలంలో సైనిక, పోలీసు బలగాలను మోహరించారు. పేలుడుకు గల కారణం లేదా మృతుల సంఖ్యపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.

    క్వెట్టాలో జరిగిన పేలుడును రైల్వే మంత్రి మహమ్మద్ హనీఫ్ అబ్బాసి తీవ్రంగా ఖండించారు.

    " క్వెట్టా కంటోన్‌మెంట్ నుంచి వస్తున్న షటిల్ రైలు చమన్ గేట్ దగ్గర పేలుడుకు గురైంది" అని రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి తెలిపారు.

    పేలుడు కారణంగా ఇంజన్‌తో సహా మూడు కోచ్‌లు పట్టాలు తప్పగా, మరో రెండు కోచ్‌లు బోల్తా పడ్డాయని ఆయన చెప్పారు.

  4. త్విషా శర్మ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, రేపు విచారణ

    త్విషా శర్మ మృతి కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి రేపు విచారణ జరపాలని నిర్ణయించింది.

    ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం త్విషా శర్మ మృతి కేసును సోమవారం విచారించనుంది.

    త్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్ వరకట్నం కోసం ఆమెను వేధించారని, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

    సమర్థ్ సింగ్ శుక్రవారం జబల్‌పూర్‌లో లొంగిపోగా శనివారం ఆయన్ను ఏడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు.

    మరోవైపు త్విషా అత్త గిరిబాలసింగ్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.

    మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్‌లోని అత్తగారింట్లో త్విషా శర్మ మృతదేహం లభ్యమైంది.

    ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన నలుగురు సీనియర్ వైద్యుల బృందం రాష్ట్ర ప్రభుత్వ చార్టర్డ్ విమానంలో శనివారం సాయంత్రం భోపాల్‌కు చేరుకుంది.

    ఆ బృందం అత్యాధునిక ఫోరెన్సిక్ పరికరాలను వెంట తెచ్చుకుందని అధికారులు తెలిపారు.

    త్విషా శర్మ మృతదేహానికి ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో ఇవాళ రెండో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో కూడా తీయనున్నారు.

    ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి. సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

  5. వైట్ హౌస్ కాల్పుల ఘటన: మనకు ఇంకా తెలియని కీలక విషయాలు

    వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిపిన నాసిరే బెస్ట్ ఉద్దేశం ఏంటో ఇంకా తెలియరాలేదు. ఆయన ఏ రకమైన ఆయుధాన్ని ఉపయోగించాడనే దానిపై కూడా ఇంకా ఎటువంటి నిర్ధారణ రాలేదు.

    ఈ ఘటనలో తుపాకీ కాల్పులకు గురైన సాధారణ పౌరుడి గురించి కూడా ఇంకా వివరాలు బయటకు రాలేదు. అసలు ఆ వ్యక్తి.. బెస్ట్ జరిపిన కాల్పుల వల్ల గాయపడ్డారా? లేక సీక్రెట్ సర్వీస్ జరిపిన ఎదురుకాల్పుల్లో గాయపడ్డారా తెలియలేదు.

    ట్రంప్, కాల్పులు జరిగిన సమయంలో వైట్ హౌస్‌లోనే ఉన్నారని సీక్రెట్ సర్వీస్ ధ్రువీకరించినప్పటికీ, ఈ ఘటనపై ట్రంప్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

  6. వైట్‌హౌస్ పరిసరాల్లో భారీగా సీక్రెట్ సర్వీస్ బలగాలు, టామ్ బెన్నెట్, వాషింగ్టన్ డీసీ నుంచి

    వైట్‌హౌస్ సమీపంలోని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై ఒక సాయుధుడు కాల్పులు జరిపి కొన్ని గంటలు గడిచినప్పటికీ, అక్కడ ఇంకా పోలీసు బలగాల మోహరింపు భారీగా ఉంది.

    అధ్యక్షుడు ట్రంప్ అధికారిక నివాసానికి దారితీసే వీధుల వద్ద భారీగా గస్తీ ఏర్పాటు చేశారు. రోడ్లపై నిలిపి ఉన్న అనేక పోలీసు వాహనాలు కనిపిస్తున్నాయి. ఈ వీధుల సమీపంలో చాలామంది జర్నలిస్టులు గుమిగూడారు.

    కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగుతున్నందున బహుశా ఈ వీధులను రాత్రంతా మూసి ఉంచొచ్చని అక్కడ ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు నాతో చెప్పారు.

    అయితే, నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించలేదు. మాకు కేవలం కొన్ని బ్లాకుల దూరంలోనే ఉన్న రెస్టారెంట్లు, బార్లలో ప్రజలు తమ వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

    (నోట్: భారత్ కంటే అమెరికా కాలమానం 10:30 గంటలు వెనుక ఉంటుంది)

  7. కాల్పులు జరిపింది 21 ఏళ్ల యువకుడిగా గుర్తింపు

    వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు జరిపి, భద్రతా సర్వీసుల ఎదురుకాల్పుల్లో మరణించిన అనుమానితుడు ఎవరో పోలీసులు గుర్తించినట్లు బీబీసీ భాగస్వామి మీడియా సంస్థ సీబీఎస్ తెలిపింది.

    21 ఏళ్ల నాసిరే బెస్ట్ ఆ కాల్పులు జరిపినట్లు ఇన్వెస్టిగేషన్‌తో సంబంధమున్న ఒక వ్యక్తిని ఉటంకిస్తూ సీబీఎస్ రిపోర్ట్ చేసింది.

    ‘నిందితుడు 2025 జులైలో వైట్‌హౌస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు అమెరికా సీక్రెట్ సర్వీస్ అతన్ని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా అతన్ని సైకియాట్రిక్ వార్డ్‌కు పంపించారు’ అని సదరు వ్యక్తిని చెప్పినట్లు సీబీఎస్ తెలిపింది.

  8. వైట్‌హౌస్ సమీపంలో ‘15 నుంచి 30 రౌండ్ల పాటు’ కాల్పులు

    అమెరికా వైట్ హౌస్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది.

    స్థానిక సమయం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో వైట్ హౌస్ వద్ద ఉన్న పలువురు జర్నలిస్టులు తమకు ఒక్కసారిగా తుపాకీకాల్పుల శబ్దం వినిపించినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

    సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే వారిని భవనం లోపలికి, ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. ఆపై వైట్ హౌస్‌ను లాక్‌డౌన్ చేశారు.

    సుమారు 15 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగినట్లు బీబీసీ భాగస్వామి సీబీఎస్ న్యూస్ పేర్కొంది. ఒకే ఒక్క సాయుధుడు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల వైపు దూసుకువచ్చి వారిపై కాల్పులు జరిపాడని, ఆ తర్వాత సదరు ఏజెంట్లు ఎదురుకాల్పులు జరిపినట్లు సీబీఎస్ రిపోర్ట్ చేసింది.

    17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో ఒక సాయుధుడు తన బ్యాగ్ నుంచి ఆయుధం తీసి కాల్పులు మొదలుపెట్టినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రకటించింది.

    ‘సీక్రెట్ సర్వీస్ పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడికి గాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతడు మరణించినట్లు ప్రకటించారు. ఈ కాల్పుల సమయంలో అక్కడ ఉన్న ఒక సాధారణ పౌరుడు కూడా గాయపడ్డారు.

    అధికారులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు వైట్ హౌస్‌లోనే ఉన్నారు’ అని తన ప్రకటనలో పేర్కొంది.

    ట్రంప్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద ఒక సాయుధుడు కాల్పులు జరిపిన నెల రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది.

  9. నమస్తే...

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నేను, బీబీసీ కరస్పాండెంట్ శారద మియాపురం, మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.

    మా పేజీలోని కొన్ని ముఖ్యమైన వార్తలను చదవడానికి కింది లింక్‌లపై క్లిక్ చేయండి.

    • కాక్రోచ్ జనతా పార్టీ: దీనిని స్థాపించిన అభిజిత్ దీపక్ నుంచి ఆయన తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు?
    • తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. 12 ఫోటోల్లో..
    • ‘‘నా పిల్లలు అన్నం అడుగుతున్నారు, వారిని అమ్మేయడం తప్ప వేరే దారి లేదు’’
    • తిమింగలాలను తినేసే వింత సముద్ర జీవులివి..